షరతులతో కసిరెడ్డికి బెయిల్
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:21 AM
వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డికి(ఏ1) హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
రోనక్కు కూడా బెయిల్ మంజూరు
అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డికి(ఏ1) హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఈ కేసులో మరో నిందితుడు రోనక్ కుమార్ జస్రాజ్ పల్గోటాకు కూడా బెయిల్ ఇచ్చింది. ట్రయల్ కోర్టు సంతృప్తిమేరకు రూ.లక్షతో రెండు పూచికత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది. పాస్పోర్టును ట్రయల్ కోర్టుకు స్వాధీనపరచాలని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర హద్దులు దాటి వెళ్లడానికి వీల్లేదని పేర్కొంది. ‘‘సాక్షులను బెదిరించడం కానీ లోబరుచుకోవడం కానీ ప్రభావితం చేయడానికి వీల్లేదు. బెయిల్పై విడుదలైన 2 వారాల్లో వ్యక్తిగతంగా, ఉమ్మడిగా ఉన్న స్థిర, చరాస్థులు, బ్యాంకు, డీమ్యాట్ అకౌంట్, వ్యాపార ప్రయోజనాలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ట్రయల్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలి. దర్యాప్తు అధికారికి ఫోన్నంబర్ అందజేయాలి. ఫోన్లో అందుబాటులో ఉండాలి. ఫోన్ నంబర్ మారిస్తే దర్యాప్తు అధికారికి తెలియజేయాలి. కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రతి నెల 2, 4 ఆదివారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలి.’’ అని కోర్టు స్పష్టం చేసింది. షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు కోసం కోర్టును ఆశ్రయించేందుకు ప్రాసిక్యూషన్కు స్వేచ్ఛనిచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.