ఆర్థిక ఇబ్బందులున్నా ‘సూపర్ సిక్స్’: నిమ్మల
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:07 AM
గత వైపీసీ ప్రభుత్వం హయాంలో జరిగిన విధ్వంసం కారణంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా... సూపర్ సిక్స్ పథకాల అమలులో రాజీ లేకుండా పక్కాగా అమలు చేస్తున్నామని...
కర్నూలు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): గత వైపీసీ ప్రభుత్వం హయాంలో జరిగిన విధ్వంసం కారణంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా... సూపర్ సిక్స్ పథకాల అమలులో రాజీ లేకుండా పక్కాగా అమలు చేస్తున్నామని కర్నూలు జిల్లా ఇన్చార్జి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కర్నూలు జిల్లా 2026-27 బడ్జెట్ ఔట్రీచ్ కార్యక్రమం జరిగింది. మంత్రి టీజీ భరత్, కలెక్టర్ సిరి సహా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలు హాజరయ్యారు. రాష్ట్ర విభజన, వైసీపీ దివాలా పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. వెంటిలేటర్పై ఉన్న ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ సహకారం, స్వీయ పాలనానుభవంతో సీఎం చంద్రబాబు చక్కదిద్దుతున్నారు. రాష్ట్ర విభజన కంటే వైసీపీ పాలన ఐదేళ్లలోనే ఎక్కువ నష్టం జరిగింది. విధ్వంసమైన పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టాం. తుంగభద్ర డ్యాంలో 19 గేట్లు ఏర్పాటు పూర్తయింది. మే ఆఖరు నాటికి 33 గేట్లూ ఏర్పాటు చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.3,860 కోట్లతో హంద్రీనీవా విస్తరణ పనులు చేసి, కృష్ణా జలాలను 750 కిలోమీటర్లు తీసుకువెళ్లిన ఘనత చంద్రబాబుదే. రూ.53 కోట్లతో గోరుకల్లు ఆనకట్ట మరమ్మతులు చేపట్టాం’ అని వివరించారు.