‘7 లక్షల కోట్ల’ వైసీపీ నేత అరెస్ట్
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:29 AM
తన బ్యాంకు ఖాతాలో రూ.7 లక్షల కోట్లు ఉన్నాయని నమ్మించి, పలువురిని మోసగించిన వైసీపీ నాయకుడు ఎర్రిస్వామిని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు అరెస్టు చేశారు.
కళ్యాణదుర్గంలో నకిలీ డాక్యుమెంట్లతో మోసాలు
బాధితులు ఫిర్యాదు చేస్తే.. న్యాయం చేస్తాం: సీఐ
కళ్యాణదుర్గం, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): తన బ్యాంకు ఖాతాలో రూ.7 లక్షల కోట్లు ఉన్నాయని నమ్మించి, పలువురిని మోసగించిన వైసీపీ నాయకుడు ఎర్రిస్వామిని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రిస్వామి మోసాలపై ఈ నెల 10న ‘నా బ్యాంకు ఖాతాలో రూ.7 లక్షల కోట్లు ఉన్నాయ్’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీంతో యూనియన్ బ్యాంకు పేరిట నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినందుకు ఆ బ్యాంకు కళ్యాణదుర్గం బ్రాంచి మేనేజర్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం కళ్యాణదుర్గం మండలం ఒంటిమిద్దె గ్రామానికి చెందిన ఎర్రిస్వామిని అరెస్టు చేశారు. ఎర్రిస్వామిని విచారిస్తున్నామని సీఐ హరినాథ్ చెప్పారు. ఈ కేసులో ఎర్రిస్వామితోపాటు ఇతరుల హస్తం ఉందని భావిస్తున్నామని, వారిపైనా కేసు నమోదు చేస్తామని తెలిపారు. బాధితులు ముందుకువచ్చి ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామన్నారు.