నేడు కాకినాడకు సాదిక్
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:08 AM
కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు షేక్ సాధిక్ ఖాన్ను పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు.
సర్పవరం పోలీస్ స్టేషన్లో విచారణకు ఏర్పాట్లు
కాకినాడ, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు షేక్ సాధిక్ ఖాన్ను పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఓ లాడ్జిలో ఉండగా చాకచక్యంగా అరెస్టు చేసినట్టు తెలిసింది. అక్కడి నుంచి కాకినాడకు తీసుకురానున్నట్టు సమాచారం. సాధిక్కు ముస్లిం తీవ్రవాద సంస్థలతో ఏమైనా లింకులున్నాయా అనే కోణంలోనూ తనిఖీ చేసినట్టు తెలిసింది. ఆదివారం అతడిని కాకినాడ సర్పవరం పోలీసు స్టేషన్లో విచారించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిది మంది సీఐల బృందం నూకరాజు, ఆయన కుమార్తె రాసిన సూసైడ్ నోట్ల ఆధారంగానే సాదిక్ను ప్రశ్నించనున్నారు. నూకరాజు కుటుంబంతో పరిచయడం ఎలా ఏర్పడింది? సౌజన్యతో ఉన్న సంబంధం ఏమిటి? ఇలా సుమారు 50కిపైగా ప్రశ్నలను సంధించనున్నట్టు తెలిసింది.
వైసీపీ నేత అండతో....
వైసీపీ ముస్లిం మైనారిటీ విభాగంలో సాధిక్ యాక్టివ్గా ఉండేవాడని తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అతని ఆగడాలకు కాకినాడ సిటీ ముఖ్య నాయకుడు అండగా నిలిచేవాడని సమాచారం. ఆయనతో సన్మానాలు, సత్కారాలు చేయించుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకున్నాడని అంటున్నారు. ఆ నాయకుడి సిఫారసుతోనే సాదిక్ ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో రైఫిల్ షూటర్ ట్రైనీగా చేరాడన్నారు.