రూ.1.45 కోట్లతో రోడ్లు.. డ్రైన్లు
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:59 AM
కడప నగరంలోని 15వ డివిజన్లో రోడ్లు, ప్రధాన డ్రైనేజీ పనులు రూ.1.45 కోట్లతో చేపడతామని ఎమ్మెల్యే ఆర్.మాధవి హామీ ఇచ్చారు.
నెలలో పనులు ప్రారంభిస్తాం: మాధవి.. ‘అక్షరం అండగా..!‘ కార్యక్రమంలో పాల్గొన్న కడప ఎమ్మెల్యే
కడప ఎర్రముక్కపల్లె, మార్చి 18(ఆంధ్రజ్యోతి): కడప నగరంలోని 15వ డివిజన్లో రోడ్లు, ప్రధాన డ్రైనేజీ పనులు రూ.1.45 కోట్లతో చేపడతామని ఎమ్మెల్యే ఆర్.మాధవి హామీ ఇచ్చారు. గత ఏడాది అశోక్నగర్లో సమస్యల పరిష్కారానికి కృషిచేసిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఈ సారి 15వ డివిజన్పై దృష్టి సారించింది. ఇక్కడి నిరంజన్నగర్, ఫరీదానగర్, శివానందపురం కాలనీల్లో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా.. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ‘అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆర్.మాధవి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి, కార్పొరేషన్ మున్సిపల్ ఎస్ఈ చెన్నకేశవరెడ్డి హాజరయ్యారు. స్థానికులు భారీగా తరలివచ్చి,. తమ ప్రాంతాల్లో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రోడ్లు, డ్రైనేజీల దుస్థితిని ఏకరువు పెట్టారు. ప్రజల విన్నపాలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఫరీదానగర్ డ్రైనేజీ అభివృద్ధి పనులు, నిరంజన్నగర్లో రెండు ప్రధాన రోడ్ల కోసం రూ.1.45 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. నెల రోజుల్లో ఈ పనులకు భూమిపూజ చేస్తామన్నారు.