మండిన కడప
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:06 AM
వాయువ్య దిశ నుంచి వీస్తున్న పొడిగాలులకు శుక్రవారం రాయలసీమ నిప్పుల కొలిమిలా మారింది. వడగాడ్పులతో కోస్తా కూడా ఉడికిపోయింది.
అత్యధికంగా 45.5 డిగ్రీలు నమోదు
అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): వాయువ్య దిశ నుంచి వీస్తున్న పొడిగాలులకు శుక్రవారం రాయలసీమ నిప్పుల కొలిమిలా మారింది. వడగాడ్పులతో కోస్తా కూడా ఉడికిపోయింది. రాష్ట్రంలో 45 శాతం మండలాలు అంటే 299 మండలాల్లో శుక్రవారం 40... అంతకంటే ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కడపలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. నంద్యాల జిల్లా సంజామలలో 44.8, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 44.1, నెల్లూరు జిల్లా సైదాపురంలో 43.8, మార్కాపురం జిల్లా కొమరోలులో 43.7, కాకినాడ జిల్లా కరప, పల్నాడు జిల్లా గురజాల, కర్నూలు జిల్లా కోడుమూరులో 43.6, తిరుపతి జిల్లా పెనగలూరు, శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బలో 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపరితల ద్రోణులు ప్రభావంతో శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. శనివారం మన్యం, విజయనగరం, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని 28 మండలాల్లో వడ గాడ్పులు ప్రభావం ఉంటుంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజులు కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో మేఘావృతంతో విభిన్న వాతావరణం ఉంటుం ది. మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయి.