తిరుపతిలో ‘జేఎస్ఎస్’ క్యాంపస్
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:03 AM
తిరుపతికి మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ రానుంది. మైసూరుకు చెందిన జగద్గురు శ్రీ శివరాత్రీశ్వర (జేఎస్ఎస్) మహా విద్యాపీఠం ఆధ్వర్యంలో జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఆఫ్-క్యాంప్సను ఏర్పాటు చేయనున్నారు.
ఉన్నత విద్యామండలితో జగద్గురు శ్రీ శివరాత్రీశ్వర విద్యాపీఠం ఒప్పందం
క్యాంప్సలో 74 రకాల కోర్సులు
అమరావతి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): తిరుపతికి మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ రానుంది. మైసూరుకు చెందిన జగద్గురు శ్రీ శివరాత్రీశ్వర (జేఎస్ఎస్) మహా విద్యాపీఠం ఆధ్వర్యంలో జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఆఫ్-క్యాంప్సను ఏర్పాటు చేయనున్నారు. గురువారం ఉండవల్లిలో మంత్రి లోకేశ్ సమక్షంలో ఉన్నత విద్యామండలి, జేఎస్ఎస్ మహావిద్యా పీఠం అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఎంవోయూ ప్రకారం.. తిరుపతిలో ఏర్పాటు చేయనున్న క్యాంప్సలో మొత్తం 74 రకాల కోర్సులు అందుబాటులోకి తెస్తారు. అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్, లైఫ్ సైన్సెస్, మేనేజ్మెంట్, టూరిజం, లా, హ్యుమానిటీస్ తదితర కోర్సులు ఇందులో ఉంటాయి. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత 10 వేల మందికి పైగా విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది. ఈ క్యాంపస్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. కార్యక్రమంలో మైసూరు జేఎస్ఎస్ ఏహెచ్ఈఆర్ రిజిస్ర్టార్ బి.మంజునాథ, డీన్ ప్రశాంత్ ఎం.విశ్వనాథ్, రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్ భరత్ గుప్తా పాల్గొన్నారు.