క్వాంటం వ్యాలీలో పెట్టుబడులకు సిద్ధం
ABN , Publish Date - May 13 , 2026 | 05:11 AM
అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు తమిళనాడుకు చెందిన జెప్పియార్ యూనివర్సిటీ, క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సంస్థతో కలసి ముందుకు వచ్చింది.
జెప్పియార్ వర్సిటీ వీసీ రెజీనా, క్వాంటం గ్లోబల్ సీఈవో సంజయ్
అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు తమిళనాడుకు చెందిన జెప్పియార్ యూనివర్సిటీ, క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సంస్థతో కలసి ముందుకు వచ్చింది. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆ రెండు సంస్థల ప్రతినిధుల బృందం సీఎం కార్యదర్శి ప్రద్యుమ్నను కలిసింది. అనంతరం వర్సిటీ వీసీ రెజినా మీడియాతో మాట్లాడారు. క్వాంటం ఏఐ వ్యాలీతో భాగస్వామ్యం చేసుకునే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ పరిశోధనలు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి క్వాంటమ్ ఏఐ గ్లోబల్తో కలసి పని చేస్తామని తెలిపారు. క్వాంటం ఏఐ గ్లోబల్ సీఈవో సంజయ్ చిటోరే మాట్లాడుతూ... క్వాంటం గురించి బోధించడమే కాకుండా ప్రయోగాలకు, పరిశోధనలకు కూడా అవకాశం ఉందన్నారు. క్వాంటం కమ్యూనికేషన్స్, క్వాంటం సెన్సెస్, స్కిల్ డెవల్పమెంట్కు అధిక ప్రాధాన్యత ఉందన్నారు. జేపియర్ యూనివర్శిటీ ప్రో వైస్ చాన్స్లర్ కిశోర్ మాట్లాడుతూ.. మేధా టవర్స్ ఆర్టీహెచ్ ఇన్నోవేషన్ హబ్లోని సదుపాయాలు ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు. క్వాంటం ఏఐ గ్లోబల్ అనుబంధ సంస్థ క్యూ అకాడమీ సీఈవో గోపిక చాగంటి మాట్లాడుతూ... క్వాంటం సాంకేతికత అభివృద్ధి లక్ష్యంతో సాగుతున్న అమరావతి క్వాంటం వ్యాలీవైపు ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు.