ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి గెలిస్తే నిజాయితీగా పాలన చేయలేరు
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:54 AM
ఎన్నికల్లో ఒక్క నియోజకవర్గంలోనే రూ.30 నుంచి రూ.40 కోట్లు ఖర్చు చేసేవారు నిజాయితీతో పాలన అందించలేరని ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ వ్యవస్థాపకులు..
జయప్రకాశ్ నారాయణ
కడప ఎడ్యుకేషన్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఒక్క నియోజకవర్గంలోనే రూ.30 నుంచి రూ.40 కోట్లు ఖర్చు చేసేవారు నిజాయితీతో పాలన అందించలేరని ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ తెలిపారు. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం 21వ వ్యవస్థాపక దినోత్సవం, కళాశాల వార్షికోత్సవానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాత్కాలిక తాయిలాలు, కుల మత ప్రలోభాలు లేకుండా ఓటర్లు ఆత్మగౌరవంతో ఓటు వేయగల వ్యవస్థ ఏర్పడితేనే భారత ప్రజాస్వామ్యం బలపడుతుందని తెలిపారు. నైపుణ్యాలను పెంపొందించుకొని సంపద సృష్టిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు సూచించారు. ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో రోజువారీ ఖర్చులతో భారీ లోటు పెరుగుతోందని, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు సంక్షోభంలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్, రిజిస్ర్టార్ ప్రొఫెసర్ పద్మ, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.