కులమతాల మధ్య చిచ్చుకు వైసీపీ కుట్ర
ABN , Publish Date - Jul 11 , 2026 | 04:15 AM
రాష్ట్రంలో కులమతాల మధ్య చిచ్చుపెట్టి, ఆ మంటల్లో చలి కాచుకునేందుకు వైసీపీ అనేక కుట్రలు పన్నుతోందని జనసేన..
రావణ్, శ్రవణ్లకు తాడేపల్లి ప్యాలెస్ నుంచే డైరెక్షన్: జనసేన
మంగళగిరి సిటీ, జూలై 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కులమతాల మధ్య చిచ్చుపెట్టి, ఆ మంటల్లో చలి కాచుకునేందుకు వైసీపీ అనేక కుట్రలు పన్నుతోందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మాల వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్కుమార్ ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జడ శ్రవణ్, ప్రశ్న రావణ్లు తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోనే నడుస్తున్నారని ఆరోపించారు. అవినీతి కేసుల్లో ఉద్యోగం పోగొట్టుకుని సమాజంలో అలజడులు సృష్టించడం ద్వారా పబ్బం గడుపుకోవాలని చూస్తున్న శ్రవణ్కు... జనం కోసం నిత్యం పరితపిస్తున్న పవన్ కల్యాణ్ను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. ఏలూరులో దళిత క్రైస్తవ శంఖారావం పేరిట ఏర్పాటు చేసిన సభలో కేవలం పవన్ కల్యాణ్ను విమర్శించారే తప్ప దళిత, క్రైస్తవుల సంక్షేమం గురించి ఏం మాట్లాడారని విజయకుమార్ ప్రశ్నించారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ... పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా పారదర్శక విధానాలతో ముందు కు వెళుతున్న పవన్ కల్యాణ్ను విమర్శించే స్థాయి శ్రవణ్కు లేదన్నారు.