స్టీల్ ప్లాంట్కు జగన్ చేసింది శూన్యం
ABN , Publish Date - Jun 12 , 2026 | 04:53 AM
విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ చేసింది శూన్యమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు.
పరిశ్రమ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకున్నారు..: పట్టాభి
అమరావతి, జూన్ 11(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ చేసింది శూన్యమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉక్కు పరిశ్రమ కోసం తాను రెండు లేఖలు రాశానని ఆయన చెబుతున్నారని, అయితే స్టీల్ ప్లాంట్ భూములను ప్లాట్లు వేసి విక్రయించాలన్నదే ఆ లేఖల సారాంశమని తెలిపారు. వైసీపీ హయాంలో స్టీల్ ఉత్పత్తికి అవసరమైన మాంగనీస్, సిలికా, లైమ్స్టోన్ వంటి కీలక ఖనిజ గనుల లీజుల పొడిగింపులో తీవ్ర జాప్యం జరిగిందని, దీంతో ప్లాంట్ కార్యకలాపాలు ఇబ్బందుల్లో పడ్డాయని పేర్కొన్నారు. 2024లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లీజులను పొడిగించారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ను కాపాడటంలో టీడీపీకి తొలి నుంచి మంచి ట్రాక్ రికార్డే ఉందని, వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు రూ.1350 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఇప్పించడంలో నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఇదే విధంగా గతేడాది ప్రధాని మోదీతో మాట్లాడి రూ.12 వేల కోట్ల ప్యాకేజీ తీసుకొచ్చారని తెలిపారు.