Minister Farooq and MLC Beda Ravi Chandra: ఇతరుల క్రెడిట్ చోరీ చేయడమే జగన్ క్రెడిట్
ABN , Publish Date - Jan 20 , 2026 | 05:09 AM
దిగజారుడు రాజకీయాలకు, ఫేక్ ప్రచారాలకు చిరునామాగా వైసీపీ మారిందని మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర విమర్శించారు.
మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): దిగజారుడు రాజకీయాలకు, ఫేక్ ప్రచారాలకు చిరునామాగా వైసీపీ మారిందని మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ... ‘ఇతరుల క్రెడిట్ చోరీ చేయడమే జగన్ క్రెడిట్. జగన్ చేసిన అడ్డగోలు పనుల వల్లే రెవెన్యూ సమస్యలు. చాలా భూములను 22ఏలో పెట్టి కబ్జా చేసే ప్రయత్నం చేశారు. రైతుల పాస్పుస్తకాలపై జగన్ ఫొటోలు వేసుకున్నారు. గుంటూరులో క్రిస్టియన్ భవనాన్ని, కడపలో హజ్ హౌస్నూ జగన్ పూర్తి చేయకుండా వదిలేస్తే... ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తోంది’ అని అన్నారు. రవిచంద్ర మాట్లాడుతూ... ‘కూటమి ప్రభుత్వం ఏం చేసినా దాన్ని తామే చేశామని క్రెడిట్ చోరీ చేయడం వైసీపీకి అలవాటైంది. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చినందుకు, 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడినందుకు జగన్కు క్రెడిట్ ఇవ్వాలా?’ అని ప్రశ్నించారు.