102 సీమ ప్రాజెక్టులు రద్దు చేసింది జగనే: మద్దిపట్ల
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:33 AM
‘రాయలసీమ లిఫ్టు పనులను కూటమి ప్రభుత్వం ఆపేసింది. రాయలసీమ తీవ్రంగా నష్టపోతోంది. లిఫ్టు పనులు వెంటనే చేపట్టాలి’ అని వైసీపీ గ్రామ సింహాలు రోజూ గర్జించడం చూసి...
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): ‘రాయలసీమ లిఫ్టు పనులను కూటమి ప్రభుత్వం ఆపేసింది. రాయలసీమ తీవ్రంగా నష్టపోతోంది. లిఫ్టు పనులు వెంటనే చేపట్టాలి’ అని వైసీపీ గ్రామ సింహాలు రోజూ గర్జించడం చూసి సీమ ప్రజలు నవ్వుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్ అన్నారు. 102 ప్రాజెక్టులు రద్దుచేసిన రాయలసీమ వ్యతిరేకి జగన్ అంటూ దుయ్యబట్టారు. ‘రాయలసీమ లిఫ్టుకు 2020 మే 5న టెండర్లు పిలిచి, రూ.1000 కోట్లు పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్కు దోచిపెట్టారు. సీమ లిఫ్టుపై 2021లో ఎన్జీటీ స్టే ఇస్తే ఆ రోజు వైసీపీ గ్రామ సింహాలు ఏం చేస్తున్నాయి? వివేకా హత్య కేసు నిందితులను కాపాడుకునేందుకు, అంగళ్ల కేసులో వందల మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టి వారిని జైలుకు పంపేందుకు రూ.కోట్లు ఖర్చు చేసి లాయర్లను పెట్టుకున్నారు. మరి రాయలసీమ లిఫ్టుపై ఎన్జీటీలో మాత్రం మంచి లాయర్ను పెట్టి ఎందుకు వాదనలు వినిపించలేదు?’ అని ఆయన ప్రశ్నించారు.