మండలంగా ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:56 PM
పరిపాలన సౌలభ్యం కోసం తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని పెద్దహరివాణం మండల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
పెద్దహరివాణం మండల సాధన నాయకులు
సబ్కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
ఆదోని, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): పరిపాలన సౌలభ్యం కోసం తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని పెద్దహరివాణం మండల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల సాధన కమిటీ సభ్యులు ఆదినారాయణరెడ్డి, మెడికల్ నాగరాజు, పోరప్ప గర్జప్ప మాట్లాడుతూ మండల విభజన వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. గతంలో మంజూరైన మండలాన్ని రద్దు చేసి ఆదోని-1, ఆదోని-2గా ఏర్పాటు చేయడం శోచనీయమన్నారు. స్థానిక నాయకుల స్వార్థం, కొందరు ప్రజాప్రతినిధుల పేర్లు రాకూడదనే సంకుచిత ధోరణితోనే పెద్దహరివాణం మండల హోదాను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో పెద్దహరివాణం మండలం చేస్తామని హామీ ఇచ్చిన నాయకులు అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని విస్మరించారని వాపోయారు. పెద్దహరివాణం మండలం సాధించేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కూడా వెనుకాడబోమని కమిటీ సభ్యులు హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.