పోలవరం కాల్వగట్టుపై తనిఖీలు
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:36 AM
కొత్తూరు తాడేపల్లిలోని పోలవరం కుడి కాల్వ గట్టుపై మట్టి అక్రమ తవ్వకాలపై ఎట్టకేలకు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు రైట్ మెయిన్ కెనాల్ (పీఐపీఆర్ఎంసీ) అధికారుల్లో కదలిక వచ్చింది. మట్టి తవ్వకాల అనుమతులు రద్దు చేసినా.. అక్రమార్కులు భారీగా తవ్వకాలను కొనసాగించడంపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘మట్టి మాఫియా బరితెగింపు’ అనే శీర్షికతో ప్రత్యేక కథనం ఆదివారం ప్రచురితమైంది.
- మట్టి అక్రమ తవ్వకాలపై స్పందించిన పీఐపీఆర్ఎంసీ అధికారులు
- తనిఖీల సమాచారంతో పరారైన మట్టి మాఫియా
- ఘటనాస్థలంలో టిప్పర్, మామిడి తోటల్లో దాచిన 3 ప్రొక్లెయిన్లు సీజ్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
కొత్తూరు తాడేపల్లిలోని పోలవరం కుడి కాల్వ గట్టుపై మట్టి అక్రమ తవ్వకాలపై ఎట్టకేలకు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు రైట్ మెయిన్ కెనాల్ (పీఐపీఆర్ఎంసీ) అధికారుల్లో కదలిక వచ్చింది. మట్టి తవ్వకాల అనుమతులు రద్దు చేసినా.. అక్రమార్కులు భారీగా తవ్వకాలను కొనసాగించడంపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘మట్టి మాఫియా బరితెగింపు’ అనే శీర్షికతో ప్రత్యేక కథనం ఆదివారం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన పీఐపీఆర్ఎంసీ అధికారులు సోమవారం పోలవరం కాల్వగట్టుపై తనిఖీలు నిర్వహించారు. పీఐపీఆర్ఎంసీ ఈఈ సుబాన్, డీఈ అప్పిరెడ్డి, జేఈ కౌశిక్ మట్టి తవ్విన ప్రదేశాలను పరిశీలించారు. అధికారులు వస్తున్నారన్న సమాచారం ముందుగానే అక్రమార్కులకు తెలియడంతో మట్టి తవ్వకాలను నిలుపుదల చేసి పరారయ్యారు. తనిఖీల సమాచారాన్ని పీఐపీఆర్ఎంసీ కార్యాలయానికి చెందిన ఉద్యోగులే చేరవేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలవరం కాల్వ వద్దకు అధికారులు తనిఖీలకు వచ్చారన్న విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అక్రమ తవ్వకాల గురించి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పక్కనే ఉన్న మామిడి తోటల్లో దాచిన ప్రొక్లెయిన్లను అధికారులకు చూపించారు. అలాగే తవ్వకాలు జరిపిన ప్రదేశంలో ఒక భారీ టిప్పర్ను కూడా గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని టూటౌన్ పోలీసులకు అప్పగించారు.