Department of Personnel and Trainingఫ ఐఏఎస్ క్యాడర్ స్ట్రెంత్ 259కి పెంపు
ABN , Publish Date - Jan 20 , 2026 | 05:13 AM
పెరుగుతున్న పాలనా అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఐఏఎస్ క్యాడర్ స్ట్రెంత్ను 239 నుంచి 259కి పెంచింది.
గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన డీవోపీటీ
అమరావతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న పాలనా అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఐఏఎస్ క్యాడర్ స్ట్రెంత్ను 239 నుంచి 259కి పెంచింది. ఈ మేరకు.. సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ) అండర్ సెక్రటరీ రాజేశ్ కుమార్ యాదవ్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2017లో డీవోపీటీ చివరిసారిగా ఐఏఎ్సల క్యాడర్ స్ట్రెంత్ను 239కి పెంచింది. ఆ తర్వాత ఏపీలో భౌగోళికంగా అనేక మార్పులు జరిగాయి. 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఏర్పడ్డాయి. తాజాగా కూటమి ప్రభుత్వం మరో రెండు పెంచి 28 జిల్లాలు చేసింది. ఈ నేపథ్యంలో 239 మంది ఐఏఎ్సలు సరిపోవడం లేదని, క్యాడర్ స్ట్రెంత్ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో కేంద్రాన్ని కోరుతోంది. దీంతో కేంద్రం అదనంగా 20 ఐఏఎస్ పోస్టులను రాష్ట్రానికి కేటాయించడంతో క్యాడర్ స్ట్రెంత్ 259కి పెరిగింది. అలాగే మొన్నటి వరకూ ఉన్న 13 జిల్లా కలెక్టర్ క్యాడర్ పోస్టులను 26కు పెంచింది. జాయింట్ కలెక్టర్ క్యాడర్ పోస్టులను కూడా 13 నుంచి 26కు పెంచింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను 181కి పెంచింది. ప్రమోషన్ ద్వారా 78 పోస్టులు భర్తీ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల పోస్టును కూడా మరొకటి కేటాయించింది. దీంతో ఈ సంఖ్య మూడుకు చేరింది. అలానే కేంద్రానికి డిప్యుటేషన్పై వెళ్లేవారి సంఖ్యను 56కు పరిమితం చేసింది.