పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:04 AM
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య
పత్తికొండ టౌన్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సి.ఆర్.భవన్లో పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండలాల సమావేశం జిల్లా అధ్యక్షుడు తిమ్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. రామచంద్రయ్య మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు కేంద్రంలోని నరేంద్రమోదీ, రాష్ట్రంలో చంద్రబాబు పేదల సంక్షేమం కోసం అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నెరవేర్చకపోవడం ప్రజలను మోసగించడమేనన్నారు. ఇప్పటికైనా నివాస స్థలాల కోసం నిరుపేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలాలను కేటాయించాలన్నారు. సీపీఐ పోరాట నిధి కోసం చేపట్టే గడప గడప సీపీఐ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సాగించే సమరశీల పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి భీమలింగప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు నభిరసూల్, రాజాసాహెబ్, మండల కార్యదర్శులు కారుమంచి, సుల్తాన్, నాగరాజు, పట్టణ కార్యదర్శి రామాంజినేయులు, నాయకులు కారన్న, గురుదాస్, ఈరన్న, కాశీ పాల్గొన్నారు.