క్రిమినల్ ఆలోచనలతో అలజడికి యత్నిస్తే కఠిన చర్యలు : హోం మంత్రి అనిత
ABN , Publish Date - Feb 04 , 2026 | 04:28 AM
క్రిమినల్ ఆలోచనలతో రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు వైసీపీ యత్నిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): క్రిమినల్ ఆలోచనలతో రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు వైసీపీ యత్నిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. తప్పు చేయాలనే ఆలోచన రావాలంటేనే భయపడేలా రాజకీయ రౌడీలకు పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తామని హెచ్చరించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆమె మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు పొంతనే లేదన్నారు. గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం టీడీపీ కార్యకర్తల కోపం అదుపు తప్పకుండా, సంయమనం పాటించేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నారని తెలిపారు. పార్టీ నాయకులకు వాస్తవాలు వివరించి, రాష్ట్రాభివృద్ధి లక్ష్యాలు గుర్తు చేసి, వైసీపీ ఉచ్చులో పడకుండా నియంత్రించారన్నారు. వైసీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషిస్తుంటే కూడా తమ అధినేత ఇప్పటికీ సంయమనం పాటించాలని సూచిస్తున్నారన్నారు.