చట్టాన్ని అనుసరించాల్సిందే దాని ప్రకారమే శాంతి భద్రతలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 05:52 AM
శాంతి భద్రతలు కాపాడే క్రమంలో పోలీసులు చట్ట నిబంధనలు అనుసరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
పోలీసులకు హైకోర్టు స్పష్టీకరణ
అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతలు కాపాడే క్రమంలో పోలీసులు చట్ట నిబంధనలు అనుసరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. వివిధ కేసుల్లో అరెస్టు చేసిన నిందితులతో పెరేడ్ ఎందుకు నిర్వహిస్తున్నారని పోలీసులను ప్రశ్నించింది. నేర నిరూపణ కానంత వరకు నిందితులు అమాయకులేనని పేర్కొంది. నిందితులతో పెరేడ్ నిర్వహిస్తున్నారంటూ దాఖలైన పిల్పై కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ఎస్పీలకు నోటీసులు జారీచేసింది. విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. నిందితులను వీధుల్లో నడిపిస్తూ పరేడ్ నిర్వహించడంతో పాటు వారిని మీడియా ముందు ప్రవేశ పెట్టడాన్ని సవాల్ చేస్తూ.. సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ, ఎన్విరాన్మెంటల్ సంస్థ అధ్యక్షుడు పరసా సురేశ్కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. న్యాయవాది జడ శ్రవణ్కుమార్ వాదనలు వినిపించారు.