విద్యుత్ సరఫరా తొలగించే ముందు నోటీసివ్వాల్సిందే!
ABN , Publish Date - Feb 19 , 2026 | 05:11 AM
ఒకసారి విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత, ఏదైనా కారణంతో విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని అధికారులు భావిస్తే సంబంధిత వినియోగదారుడికి ముందుగా నోటీసు ఇవ్వాల్సిందేనని...
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ఒకసారి విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత, ఏదైనా కారణంతో విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని అధికారులు భావిస్తే సంబంధిత వినియోగదారుడికి ముందుగా నోటీసు ఇవ్వాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. తప్పుడు పత్రాలు సమర్పించి విద్యుత్ కనెక్షన్ పొందారని భావిస్తే, అధికారులు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాల్సిందని స్పష్టంచేసింది. అధికారుల చర్య ఏమాత్రం సమర్థనీయం కాదంది. వారంలోగా ఆ ట్రస్ట్కు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతోపాటు మీటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. వ్యాజ్యంపై విచారణను మూసివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య ఇటీవల తీర్పు ఇచ్చారు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన కాకతీయసేవా ట్రస్ట్ చైర్మన్ పరుచూరి శ్రీనివాసరావు 2025లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వై.నాగిరెడ్డి వాదనలు వినిపించారు.