సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలుపుదల చేయలేం
ABN , Publish Date - May 06 , 2026 | 05:38 AM
ఐఏఎస్ అధికారి అహ్మద్బాబు శాఖాధిపతిగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖ, ఇతర శాఖల్లో ఏదీ సవ్యంగా లేనట్లు కనిపిస్తోందని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో చేసిన...
ఉత్తర్వుల్లోని ఆ అంశాన్ని పట్టించుకోవద్దు
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కు ధర్మాసనం ఆదేశం
అహ్మద్బాబు అప్పీల్పై హైకోర్టు ధర్మాసనం విచారణ
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ఐఏఎస్ అధికారి అహ్మద్బాబు శాఖాధిపతిగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖ, ఇతర శాఖల్లో ఏదీ సవ్యంగా లేనట్లు కనిపిస్తోందని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో చేసిన అబ్జర్వేషన్ను పట్టించుకోకుండా ఉద్యోగుల సంఘం ఇచ్చిన వినతిపై తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర విజిలెన్స్ కమిషనర్ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను పాక్షికంగా సవరించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించాలన్న అహ్మద్బాబు అభ్యర్థనను తోసిపుచ్చింది. అహ్మద్బాబు దాఖలు చేసిన అప్పీల్పై విచారణను జూలైకి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని, ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా వేధిస్తున్న చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్(సీసీఎస్టీ) అహ్మద్బాబుపై చర్యలు తీసుకొనేలా కేంద్ర విజిలెన్స్ కమిషనర్ను ఆదేశించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రమేశ్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి... ఐఏఎస్ అధికారి అహ్మద్బాబు శాఖాధిపతిగా ఉన్న రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ, ఇతర శాఖల్లో ఏదీ సవ్యంగా లేనట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.