Share News

వ్యక్తిగత గోప్యత పేరుతో తప్పించుకోలేరు

ABN , Publish Date - Jun 02 , 2026 | 06:03 AM

వ్యక్తిగత గోప్యత పేరు చెప్పి ఆధార్‌ వివరాలు ఇవ్వడానికి నిరాకరించరాదని ఆధార్‌ సంస్థ(యూఐడీఏఐ)కు హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది.

వ్యక్తిగత గోప్యత పేరుతో తప్పించుకోలేరు

  • నకిలీ ఆధార్‌ కేసులో వివరాలివ్వండి

  • యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత గోప్యత పేరు చెప్పి ఆధార్‌ వివరాలు ఇవ్వడానికి నిరాకరించరాదని ఆధార్‌ సంస్థ(యూఐడీఏఐ)కు హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. ఆ గోప్యత హక్కును కవచంగా వాడుకొని చట్టం నుంచి తప్పించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 33(1) ప్రకారం సమాచారం ఇవ్వడంపై సంపూర్ణ నిషేధం ఏమీ లేదని తెలిపింది. తగిన రక్షణ చర్యలతో కోర్టు ఆదేశాల మేరకు వివరాలు ఇవ్వవచ్చని పేర్కొంది. నకిలీ ఆధార్‌ సృష్టించి మోసపూరితంగా భూమిని వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసిన కేసులో నిందితుడి ఆధార్‌, బయోమెట్రిక్‌ వివరాలు పోలీసులకు అందజేయాలని యూఐడీఏఐను ఆదేశించింది. ఈ మేరకు హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. విశాఖపట్నంజిల్లా, పెందుర్తి మండలం, సరిపల్లి గ్రామానికి చెందిన సీతారామాంజనేయులకు చెందిన భూమిని నకిలీ ఆధార్‌ సృష్టించి యండాడకు చెందిన చలమారెడ్డి ప్రవీణ్‌ కుమార్‌ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసిన కేసును హైకోర్టు విచారించింది. పిటిషనర్‌ పేరుపై నకిలీ ఆధార్‌ సృష్టించారు కాబట్టి వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందనే ప్రశ్నే ఉత్పన్నం కాదని పేర్కొంది.

Updated Date - Jun 02 , 2026 | 06:03 AM