తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
ABN , Publish Date - Jun 27 , 2026 | 04:51 AM
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. మొహర్రం సెలవుతో పాటు వారాంతం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది.
సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుమల, జూన్ 26(ఆంధ్రజ్యోతి): తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. మొహర్రం సెలవుతో పాటు వారాంతం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వీరికి 12 గంటల దర్శన సమయం పడుతోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్ మూసివేశారు. తిరిగి సాయంత్రం నుంచి అక్టోపస్ సర్కిల్ మీదుగా సర్వదర్శన భక్తులను క్యూలోకి అనుమతించారు.
అలిపిరిలో వాహనాల బారులు
ఇటీవల సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిన క్రమంలో అలిపిరి తనిఖీ కేంద్రం నిరంతరం రద్దీగానే కనిపిస్తోంది. గురువారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు దాదాపు 11 వేల వాహనాలు తిరుమలకు చేరుకోగా, శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికే 10 వేల వాహనాలు తిరుమలకు వచ్చాయి. తనిఖీ కేంద్రం నుంచి వాహనాలు జూపార్క్ రోడ్డువైపు దాకా క్యూకట్టాయి. ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.