బండరాయితో బాది.. తల నరికి!
ABN , Publish Date - Feb 04 , 2026 | 04:18 AM
ఎకరం పొలం కోసం తమ్ముడి తలపై బండరాయితో మోదడంతో పాటు పిన్ని తలను నరికేసి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత తెగిన తలను చేతబట్టుకుని వీధుల్లో తిరుగుతూ...
ఎకరం పొలం కోసం జంట హత్యలు
పిన్ని, తమ్ముడిని దారుణంగా చంపిన సోదరులు
తెగిన తలను చేతబట్టుకొని ‘రప్పా రప్పా’ కేకలు
అనంతపురం జిల్లా తరిమెలలో అర్ధరాత్రి ఉన్మాదం
శింగనమల, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ఎకరం పొలం కోసం తమ్ముడి తలపై బండరాయితో మోదడంతో పాటు పిన్ని తలను నరికేసి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత తెగిన తలను చేతబట్టుకుని వీధుల్లో తిరుగుతూ భయోత్పాతం సృష్టించారు. తమ జోలికి వస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది.. ‘రప్పా.. రప్పా’ అంటూ గంజాయి మత్తులో వీరంగం చేశారు. ఈ జంట హత్యల ఘటన అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెల గ్రామం ఎస్సీ కాలనీలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తరిమెలకు చెందిన దండోరా నల్లప్పకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మీదేవికి ఇద్దరు కుమారులు ఓంకార్, జగజ్జీవన్. రెండో భార్య యల్లమ్మ (43)కు ప్రేమసాయి, అంబేడ్కర్ (22) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తరిమెలలోనే వేర్వేరు ఇళ్లలో కాపురాలు ఉండేవారు. యల్లమ్మ అంగన్వాడీ కార్యకర్త. రెండేళ్ల క్రితం నల్లప్ప మృతిచెందాడు. బతికున్నప్పుడే లక్ష్మీదేవికి 3 ఎకరాల మెట్ట పొలం, యల్లమ్మకు ఎకరం వరి మడి రాసిచ్చాడు. ఐదేళ్ల క్రితం ప్రేమసాయి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే నల్లప్ప మృతి తర్వాత యల్లమ్మకు రాసిచ్చిన ఎకరం పొలం తమకే ఇవ్వాలని ఆయన మొదటి భార్య కుమారులు ఓంకార్, జగజ్జీవన్ గొడవ పడేవారు. ఈ క్రమంలో ఓంకార్, జగజ్జీవన్, బెంగళూరుకు చెందిన మరో యువకుడు సోమవారం రాత్రి యల్లమ్మ ఇంటి వద్దకు వెళ్లి గొడవకు దిగారు. యల్లమ్మ, అంబేడ్కర్లను వేట కొడవళ్లతో వెంటపడి నరికారు. అంబేడ్కర్ను బండరాయితో తలపై కొట్టి చంపేశారు. యల్లమ్మ తలను నరికి వేరుచేశారు. తెగిన తలను తమ చేతిలోకి తీసుకొని కాలనీలో తిరుగుతూ హల్చల్ చేశారు.