Konaseema: వైభవంగా జగ్గన్నతోట ప్రభల తీర్థాలు
ABN , Publish Date - Jan 17 , 2026 | 03:59 AM
సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు నిర్వహించే ప్రభల తీర్థాలు కోనసీమ జిల్లాలో శుక్రవారం ఘనంగా జరిగాయి.
అంబాజీపేట, జనవరి 16(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు నిర్వహించే ప్రభల తీర్థాలు కోనసీమ జిల్లాలో శుక్రవారం ఘనంగా జరిగాయి. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట ప్రభల తీర్థం చూసేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. 11 గ్రామాల నుంచి వచ్చిన ఏకాదశ రుద్రులు, ఉప ప్రభలు జగ్గన్నతోటలో కొలువుతీరాయి. పచ్చని చేలను తొక్కుకొంటూ గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారానికి చెందిన చెన్నమల్లేశ్వర స్వామి, వీరేశ్వర స్వామి ప్రభలను పంట కాలువ దాటిస్తున్న తీరు చూపరులను గగుర్పాటుకు గురిచేసింది. గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి, గంగలకుర్రు చెన్నమల్లేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి మేనేకశ్వరస్వామి, ఇరుసుమండ ఆనందరామేశ్వరస్వామి, వక్కలంక కాశీవిశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి ప్రభలు జగన్నతోటకు తరలివచ్చాయి. అంబాజీపేట మండలం వాకలగరువు, తొండవరం గ్రామాల నుంచి సుమారు 57 అడుగుల ప్రభలను వాకలగరువులో జరిగే తీర్థానికి తీసుకువచ్చారు.