గవర్నర్కు అస్వస్థత
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:58 AM
గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో లోక్భవన్ సిబ్బంది హుటాహుటిన మణిపాల్ ఆస్పత్రిలో చేర్చారు.
ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జి
అమరావతి/తాడేపల్లి టౌన్, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో లోక్భవన్ సిబ్బంది హుటాహుటిన మణిపాల్ ఆస్పత్రిలో చేర్చారు. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శస్త్ర చికిత్స ద్వారా రాళ్లు తొలగించాలన్నారు. అయితే ప్రాథమిక చికిత్స అనంతరం నొప్పి తగ్గడంతో గవర్నర్ను ఉదయం 8 గంటలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. శనివారం హైకోర్టు సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమం, అలాగే తనను మర్యాదపూర్వకంగా కలవడానికి సీఎం చంద్రబాబు వస్తుండటంతో శస్త్రచికిత్సను గవర్నర్ వాయిదా వేసుకున్నారు.
గవర్నర్ కోలుకోవాలి: పవన్
గవర్నర్ అబ్దుల్ నజీర్ అనారోగ్యంతో ఉన్నారని తెలిసి తాను ఆందోళన చెందానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు. గవర్నర్ నూతన శక్తితో తిరిగి వచ్చి తన రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించాలని ఈ సందర్భంగా పవన్ ఆకాంక్షించారు.