ఆ పోలీసులపై క్రిమినల్ చర్యలు?
ABN , Publish Date - Feb 23 , 2026 | 05:42 AM
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కొమ్ముకాసిన పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.
ఎమ్మెల్సీ అనంతబాబుకు కొమ్ముకాసిన ఫలితం
అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కొమ్ముకాసిన పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. 2022లో జరిగిన ఈ హత్యోదంతంపై అప్పటి వైసీపీ ప్రభుత్వంలోని పలువురు పోలీసు అధికారుల తీరు కేసును తాత్సారం చేసిందన్న విమర్శలతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా దర్యాప్తులో పురోగతి లోపించడంపై రాష్ట్ర పోలీస్ బాస్నే సుప్రీంకోర్టు ఆక్షేపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీ సిఫారసులతో ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. తొలుత బాధ్యులైన అప్పటి పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ కేసులో అట్రాసిటీ చట్టం కింద కూడా నేరాభియోగాలు ఉండటంతో బాధ్యులైన పోలీసుల నిర్లక్ష్యాన్ని అదే చట్టంలోని సెక్షన్-4 కింద నేరంగా పరిగణించవచ్చన్న ప్రాసిక్యూషన్ సూచనలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అడ్వకేట్ జనరల్తో పాటు ఇతర న్యాయ నిపుణుల సూచన మేరకు ఆయా పోలీసు అధికారులపై సెక్షన్-4 కింద అభియోగాలు దాఖలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.