AP Government Approves: జగన్ కిట్లకు ఇప్పుడు చెల్లింపులు
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:43 AM
జగన్ హయాంలో ఆర్థిక అనుమతుల్లేకుండా కొనుగోలు చేసిన స్టూడెంట్ కిట్లకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
2024-25లో ‘ఆర్థిక అనుమతి’ లేకుండానే కొనుగోళ్లు
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో ఆర్థిక అనుమతుల్లేకుండా కొనుగోలు చేసిన స్టూడెంట్ కిట్లకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2024-25 విద్యా సంవత్సరానికి కిట్లు కొనుగోలు చేసిన పాఠశాల విద్యా శాఖ అప్పట్లో ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ముందుకెళ్లింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి కాంట్రాక్టు ఖరారు చేయాలి. అప్పట్లో సమగ్ర శిక్ష ఎస్పీడీ టెండర్ల కోసం ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందన లేదు. కొంతకాలానికి పాతవారికే రిపీట్ ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీచేసింది. అయితే ఉత్తర్వులకు ఆర్థిక శాఖ అనుమతి లభించలేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పాఠశాల విద్యాశాఖ కిట్లు కొనుగోలు చేసి విద్యార్థులకు పంపిణీ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ఆర్థిక అనుమతులు లేకపోవడంతో అప్పటినుంచీ ఆ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల క్యాబినెట్లో వాటి విడుదలకు ఆమోదం లభించింది. అందుకు అనుగుణంగా రూ.944.53 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది.