దుగరాజపట్నం పోర్టుకు 2170.70 ఎకరాలు
ABN , Publish Date - Feb 04 , 2026 | 05:04 AM
తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో స్థాపించే దుగరాజపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు- షిప్ బిల్డింగ్ క్లస్టర్ కోసం 1932.06 ఎకరాల పట్టా, 238.64 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ.544.30 కోట్లతో సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో స్థాపించే దుగరాజపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు- షిప్ బిల్డింగ్ క్లస్టర్ కోసం 1932.06 ఎకరాల పట్టా, 238.64 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ.544.30 కోట్లతో సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర మారిటైమ్ బోర్డుకు పాలనానుమతి ఇచ్చింది. మంగళవారం మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఈమేరకు ఉత్తర్వు జారీ చేశారు. తిరుపతి జిల్లాలోని పాతేటిపాలెంలో 251.16 ఎకరాలు, వగర్రులో 529 ఎకరాలు, వలమేడులో 724 ఎకరాలు, పామంజీలో 489.41 ఎకరాలు మొత్తంగా 1995.04 ఎకరాల పట్టా భూమి, నెల్లూరు జిల్లాలో కోట మండలంలో కొత్తపట్నంలో 46.47 ఎకరాలు, పుచ్చలపల్లిలో 129.19 ఎకరాలు మొత్తంగా 175.66 ఎకరాల ప్రభుత్వ భూమిని మారిటైమ్ బోర్డు సేకరించనుంది. ఇందుకోసం రూ.544.30 కోట్లు వ్యయం చేయనున్నది. ప్రభుత్వ నిర్ణయంతో త్వరలోనే దుగరాజపట్నం పోర్టు పనులు ప్రారంభించే వీలుందని అధికారులు చెబుతున్నారు.