3 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తా
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:44 AM
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చేపట్టిన ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా అద్దంకిలో భారీ స్పందన కనిపించింది.
‘ఆంధ్రజ్యోతి’ చర్చా వేదికలో మంత్రి హామీ
ప్రజలను నేరుగా కలుసుకున్న గొట్టిపాటి
అద్దంకిలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’కు భారీ స్పందన
అద్దంకి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చేపట్టిన ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా అద్దంకిలో భారీ స్పందన కనిపించింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా ఆయన తెలుసుకున్నారు. 3 నెలల్లో వాటన్నింటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా అద్దంకిలోని 3,4 వార్డుల పరిధిలో సమస్యలపై గురువారం రాత్రి చర్చా వేదిక నిర్వహించగా...పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మహిళలు, వృద్ధులు సైతం హాజరై తమ సమస్యలను మంత్రికి తెలిపారు. ప్రధానంగా ఆయా కాలనీలలో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు ఏర్పాటు చేయాలని కోరారు. పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహనిర్మాణం కోసం పెద్ద సంఖ్యలో అర్జీలను అందజేశారు. సుమారు రెండున్నర గంటలపాటు సాగిన కార్యక్రమంలో ప్రతి సమస్యనూ మంత్రి క్షుణ్ణంగా విన్నారు. కొన్నింటి పరిష్కారంపై అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రజ్యోతి’ మంచి కార్యక్రమం చేపట్టిందని, దీనివల్ల ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు. అద్దంకిలో అభివృద్ధి పనులకు మరో రూ.10 కోట్లు మంజూరయ్యాయన్నారు. మినీ బైపాస్ రోడ్డు పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.