సిటీ ఆఫ్ డెస్టినీ నుంచి గ్లోబల్ ఏఐ నగరంగా విశాఖ
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:29 AM
ఐటీ రంగంలో రాష్ట్రం చరిత్రాత్మక ముందడుగు వేయబోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ‘ఈ నెల 28న విశాఖలో...
గూగుల్ ప్రాజెక్టు చరిత్రాత్మక ముందడుగు: పల్లా
అమరావతి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ఐటీ రంగంలో రాష్ట్రం చరిత్రాత్మక ముందడుగు వేయబోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ‘ఈ నెల 28న విశాఖలో టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15 బిలియన్ డాలర్లు(రూ.1.35 లక్షల కోట్లు) భారీ పెట్టుబడితో 601 ఎకరాల్లో ఈ మెగా ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. 2028 జూలై నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ‘సిటీ ఆఫ్ డెస్టినీ‘గా పేరుగాంచిన విశాఖపట్నం... ఇకపై ‘గ్లోబల్ ఏఐ సిటీ’గా అవతరించబోతోంది. దేశంలోనే తొలి 1 గిగావాట్ ఏఐ హబ్గా విశాఖ రూపుదిద్దుకోవడం రాష్ట్ర అభివృద్ధికి నూతన దిశను నిర్దేశిస్తుంది. మంత్రి లోకేశ్ నిరంతర కృషి, పట్టుదల, వేగవంతమైన కార్యాచరణ వల్లే ఈ భారీ పెట్టుబడి సాధ్యమైంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ మాత్రమే కాదు. ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తుకు, రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకమైన మహత్తర అవకాశం’ అని ఎమ్మెల్యే పల్లా పేర్కొన్నారు.