సాంకేతిక విప్లవానికి దిక్సూచి గూగుల్ ఏఐ ల్యాబ్
ABN , Publish Date - Jun 04 , 2026 | 04:23 AM
సాంకేతిక విప్లవానికి గూగుల్ ఏఐ ల్యాబ్ దిక్సూచిగా నిలుస్తుందని గూగుల్ క్లౌడ్ ఎడ్యుకేషనల్ రీజినల్ హెడ్ నవీషాప్రభాకర్ తెలిపారు.
గూగుల్ క్లౌడ్ ఎడ్యుకేషన్ రీజనల్ హెడ్ నవీషా ప్రభాకర్
గుంటూరు(విద్య), జూన్ 3 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక విప్లవానికి గూగుల్ ఏఐ ల్యాబ్ దిక్సూచిగా నిలుస్తుందని గూగుల్ క్లౌడ్ ఎడ్యుకేషనల్ రీజినల్ హెడ్ నవీషాప్రభాకర్ తెలిపారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో బుధవారం గూగుల్ ఏఐ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ల్యాబ్ ద్వారా ఫిన్టెక్, ఆరోగ్య రంగం, రోబోటిక్స్, ఇంజనీరింగ్ ఆటోమేషన్, క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాల్లో అపార అవకాశాలు వస్తాయన్నారు. విద్యార్థులు అవకాశాలు అందిపుచ్చుకుని ల్యాబ్ను సమర్థంగా ఉపయోగించుకోవాలని సూచించారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు సంయుక్తంగా నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని కోరారు. విజ్ఞాన విద్యాసంస్థల సీఈఓ డాక్టర్ మేఘనా కూరపాటి ప్రసంగిస్తూ గూగుల్ ల్యాబ్ను అత్యున్నత సామర్థ్యాలతో నిర్వహించి సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె.వి.కృష్ణకిశోర్, రిజిష్ట్రార్ ఆచార్య ఎం.వి.రావు, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు.