ఏకాభిప్రాయం కుదిరాకే.. గోదావరి-కావేరిపై ముందుకు!
ABN , Publish Date - Jul 16 , 2026 | 05:25 AM
గత నెలలో తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవ సమయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, డీకే శివకుమార్, రేవంత్రెడ్డి మధ్య జరిగిన చర్చల్లో భాగంగా..
ఏపీకి కేంద్ర జలశక్తి మంత్రి స్పష్టీకరణ
నదుల అనుసంధానంపై రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్
అమరావతి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): గత నెలలో తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవ సమయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, డీకే శివకుమార్, రేవంత్రెడ్డి మధ్య జరిగిన చర్చల్లో భాగంగా సంప్రదింపుల్లో ఏకాభిప్రాయం కుదిరాకే గోదావరి-కావేరి అనుసంధానంపై ముందుకు వెళ్తామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు. నదుల అనుసంధాన ప్రక్రియపై బుధవారం ఆయన నేతృత్వంలో జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) సమావేశం వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో జరిగింది. ఈ భేటీలో ఎన్డబ్ల్యూడీఏ చైర్మన్ బాలేశ్వర్ ఠాకూర్, ఆంధ్ర తరఫున జలవనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తి, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు అధికారులు పాల్గొన్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి-కావేరి అనుసంధాన ప్రక్రియ చేపట్టాలని నరసింహమూర్తి సూచిస్తుండగా.. కేంద్ర మంత్రి జోక్యం చేసుకున్నారు. మూడు రాష్ట్రాల నడుమ ఏకాభిప్రాయం కుదిరాకే.. ఈ అనుసంధాన పథకంపై అడుగులు ముందుకు వేద్దామని చెప్పారు. అనుసంధాన ప్రక్రియలో భాగంగా తమిళనాడు, పుదుచ్చేరిలకు చెరో 45 టీఎంసీలు కేటాయించి.. తమకు 16 టీఎంసీలు మాత్రమే ఇస్తాననడంపై కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళనాడు, పుదుచ్చేరి మాత్రం గోదావరి-కావేరి అనుసంధాన ప్రక్రియను స్వాగతించాయి.