భావితరాలకు ఆదర్శం గౌతు లచ్చన్న
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:04 AM
పదిహేడేళ్ల ప్రాయంలోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ నిప్పుకణిక సర్ధార్ గౌతు లచ్చన్న భావి తరాలకు ఆదర్శమని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
తెనాలి అర్బన్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): పదిహేడేళ్ల ప్రాయంలోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ నిప్పుకణిక సర్ధార్ గౌతు లచ్చన్న భావి తరాలకు ఆదర్శమని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. లచ్చన్న కాంస్య విగ్రహాన్ని ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిబండ్పై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, 35 ఏళ్ల పాటు ప్రజా ప్రతినిధిగా పని చేసిన లచ్చన్న ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. స్వార్ధం కోసం కాకుండా సమాజ ప్రయోజనాల కోసం పోరాడారని కొనియాడారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, ప్రజల కోసం నిరంతరం ఆయన తపన పడే వారని, రైతులు, కార్మికులు, శ్రామిక వర్గం తరుపున పని చేశారని చెప్పారు. తాత గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందం కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, షేక్ మహ్మద్ నజీర్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెన్రీ క్రిష్టినా, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు పాల్గొన్నారు.