ఆరోగ్యశాఖ కార్యదర్శిగా వీరపాండియన్ బాధ్యతలు
ABN , Publish Date - Jul 15 , 2026 | 04:06 AM
ఆరోగ్యశాఖ కార్యదర్శిగా జి.వీరపాండియన్ మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తొలిరోజే సంజీవని ప్రాజెక్ట్ ప్రారంభ ఏర్పాట్లపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
తొలి రోజే సంజీవని ప్రాజెక్ట్ ప్రారంభ ఏర్పాట్లపై సమీక్ష
అమరావతి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశాఖ కార్యదర్శిగా జి.వీరపాండియన్ మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తొలిరోజే సంజీవని ప్రాజెక్ట్ ప్రారంభ ఏర్పాట్లపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి పీహెచ్సీలో సంజీవని ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ఈ నెల 25న ప్రారంభిస్తారని తెలిపారు. ప్రాజెక్ట్ ప్రారంభ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వీరపాండియన్ మాట్లాడుతూ... ఆరోగ్యశాఖ కమిషనర్గా ఏడాదిన్నరకు పైగా పనిచేసిన తాను ఈ శాఖపై తగిన అవగాహన పెంచుకున్నానని అన్నారు. ఈ అనుభవంతో కార్యదర్శిగా మరింత మెరుగైన సేవలందిస్తానని తెలిపారు. కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు శాఖల విభాగాధిపతులు, ఉద్యోగులు పూలగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు.