టీడీపీ కమిటీలో నలుగురికి అవకాశం
ABN , Publish Date - Apr 16 , 2026 | 12:18 AM
టీడీపీ అధిష్టానం బుధవారం ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రకటిచింది. మునుపెన్నడూ లేని విధంగా నంద్యాల జిల్లాకు జాతీయ, రాష్ట్ర కమిటీలో కీలక పదవులు కేటాయించింది.
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులుగా బీసీ
జాతీయ ప్రధాన కార్యదర్శిగా బైరెడ్డి శబరి
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మాండ్ర
రాష్ట్ర కార్యదర్శిగా వలసల రామకృష్ణ
జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్గా లోకేష్ నియామకంపై హర్షం
టీడీపీ వర్గాల్లో ఆనందోత్సవం
నంద్యాల, ఏప్రిల్15(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధిష్టానం బుధవారం ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రకటిచింది. మునుపెన్నడూ లేని విధంగా నంద్యాల జిల్లాకు జాతీయ, రాష్ట్ర కమిటీలో కీలక పదవులు కేటాయించింది. విధేయత, కష్టపడేతత్వం, అనుభవం ఉన్న నేతలను ఎంపిక చేస్తూ అధినేత, యువనేత దృష్టి సారించి పదవులను కట్టబెట్టారు. బుధవారం ప్రకటించిన కమిటీల జాబితాలో జిల్లా లోని మంత్రి బీసీ జనార్థనరెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరిలతో పాటు మరో ఇద్దరికి ఆయా కమిటీల్లో అవకాశం కల్పించారు. దీంతో ఆయా వర్గాలతో పాటు జిల్లాలోని టీడీపీ, నాయకులు కార్యకర్తల్లో ఆనందోత్సవం మొదలైంది. అయితే మరి కొందరికి ఆ కమిటీలో అవకాశం కల్పించి ఉంటే మరింత ఉత్సాహం ఉండేదని క్యాడర్లో కొంత చర్చ సాగుతోంది. టీడీపీలో కీలకంగా ఉండే పొలిట్బ్యూరో సభ్యుడిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బైరెడ్డి శబరి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నందికొట్కూరుకు చెందిన సీనియర్ టీడీపీ నాయకులు మాండ్ర శివానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్ వలసల రామకృష్ణ(డోన)కు రెండోసారి అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా..పార్టీ జాతీయ కార్యదర్శి స్థానంలో ఎంపీ బైరెడ్డి శబరికి అవకాశం కల్పించడంతో తొలిసారిగా ఆ పదవిని చేపట్టిన మహిళానేతగా నిలిచారు.
ఫ నిబద్ధతతో పనిచేస్తా : ఎంపీ బైరెడ్డి శబరి
జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించడంతో పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబానాయుడు, వర్కింగ్ ప్రసిడెంట్ నారా లోకేశకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యతలో పార్టీ పరంగా మరింత బాధ్యత, నిబద్దతతో పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ముందుకు సాగుతాను. తనతో పాటు ప్రధాన కార్యదర్శులుగా ఎంపికైన ఎంపీ రామ్మోహననాయుడు, రాజేష్ కిలార్కు శుభాకాంక్షలు
.పార్టీకి రుణపడి ఉంటా
- మంత్రి బీసీ జనార్ధన రెడ్డి
తెలుగుదేశం పార్టీలో అత్యున్నత అత్యంత కీలకమైన పొలిట్బ్యూరో సభ్యుడిగా ఎంపిక చేసిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, సీఎం చందద్రబబాబు నాయుడు, యువనేత నారా లోకేశకు కృతజ్ఞతలు. పార్టీ నాయకత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని గౌరవాన్ని నిలబెట్టుకుంటా. ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటా. లోకేశ నాయకత్వం పనితీరులో రాబోయే రోజుల్లో టీడీపీ క్షేత్రస్థాయిలో మరింత బలపడుతుంది. లోకేశ ఎంపికతో యువతకు, నూతన ఆలోచనలకు పార్టీలో ప్రాముఖ్యత కల్పించారు. 2029లో గెలుపే లక్ష్యంగా నారాలోకేశ నాయకత్వంలో పనిచేస్తాం.
కర్నూలు జిల్లా నుంచి పదిమంది..
పొరుగు జిల్లా కర్నూలు నుంచి పదిమందిని రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. ఉపాధ్యక్షులుగా మాజీ ఎంపీ సంజీవ కుమార్, ఆకెపోగు ప్రభాకర్, అధికార ప్రతినిధిగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, జోనల్ కో.ఆర్డినేటర్గా బీటీ నాయుడు, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా పి.తిక్కారెడ్డి, తుగ్గలి నాగేంద్ర, మాన్వి దేవేంద్రప్పలు ఎంపికయ్యారు. రాష్ట్ర కార్యదర్శులుగా ధరూర్ జేమ్స్, కె.పద్మలతారెడ్డి, దేవళ్ల వెంకట రాముడులను టీడీపీ అధినాయకత్వం ఎంపిక చేసింది.