పోలీసు కస్టడీకి మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:40 AM
హైదరాబాద్లోని గండిపేటలో రూ.కోట్ల విలువైన భూకుంభకోణం కేసులో అరెస్టయిన కీలక సూత్రధారి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును ఈవోడబ్ల్యూ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.
హైదరాబాద్ సిటీ, జూన్ 16(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లోని గండిపేటలో రూ.కోట్ల విలువైన భూకుంభకోణం కేసులో అరెస్టయిన కీలక సూత్రధారి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును ఈవోడబ్ల్యూ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నకిలీ జీవోల సృష్టి, రికార్డుల తయారీ, సంతకాల ఫోర్జరీకి సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించడానికి, లోతుగా విచారించడానికి బ్రహ్మనాయుడును పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈవోడబ్ల్యూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కోర్టు అనుమతి మేరకు ఈ నెల 16 నుంచి 19 వరకు బ్రహ్మనాయుడిని విచారించనున్న పోలీసులు... మంగళవారం మధ్యాహ్నం చంచల్గూడ జైల్లో ఆయన్ను కస్టడీకి తీసుకున్నారు. ఆయిన్ని సుమారు మూడు గంటలపాటు విచారించినట్లు తెలిసింది. బ్రహ్మనాయుడు సోదరుడు రమేశ్, అడ్వకేట్ రాధాకృష్ణ పాత్రపైనా ప్రశ్నించినట్లు తెలిసింది.