Share News

నాన్‌ ఎస్‌సీఎస్‌ కోటాలో ఐదుగురికి ఐఏఎస్‌ హోదా

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:34 AM

నాన్‌-స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌ కోటాలో ఐదుగురు సీనియర్‌ అధికారులకు ఐఏఎస్‌ హోదా కల్పిస్తూ డీవోపీటీ అండర్‌ సెక్రటరీ కవిత బుధవారం నోటిఫికేషన్‌ జారీచేశారు.

నాన్‌ ఎస్‌సీఎస్‌ కోటాలో ఐదుగురికి ఐఏఎస్‌ హోదా

ఎస్‌సీఎస్‌ కోటాలో గేదెల శ్రీను ఎంపిక

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): నాన్‌-స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌ కోటాలో ఐదుగురు సీనియర్‌ అధికారులకు ఐఏఎస్‌ హోదా కల్పిస్తూ డీవోపీటీ అండర్‌ సెక్రటరీ కవిత బుధవారం నోటిఫికేషన్‌ జారీచేశారు. మున్సిపల్‌ ఆడ్మినిస్ట్రేషన్‌కు చెందిన పి.గోపినాథ్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖకు చెందిన జి.బాలకృష్ణ, రాష్ట్ర పన్నుల శాఖకు చెందిన ఎం.జయకృష్ణ, పరిశ్రమల శాఖకు చెందిన ఎ.ఎ.ఎల్‌.పద్మావతి, జైళ్ల శాఖకు చెందిన ఎం.వరప్రసాద్‌ ఐఏఎస్‌కు ఎంపిక అయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీవోపీటీ పంపించింది. 2023-24, 2024-25 కు సంబంధించి నాన్‌ స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌ కోటాలో ఆరు ఐఏఎస్‌ పోస్టులు ఖాళీ ఉండగా ప్రభుత్వం ఐదు పోస్టులను భర్తీ చేసింది. ఆరు పోస్టులకు 69 మంది సీనియర్‌ అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో సర్వీస్‌ ట్రాక్‌ బాగున్న 29 మంది అధికారులను ఎంపిక చేసిన ప్రభుత్వం, పేర్లను యుపీఎస్సీకి పంపించింది. డిసెంబరు 29, 30 తేదీల్లో యుపీఎస్సీ వారికి ఇంటర్వ్యూలను నిర్వహించింది.

రాష్ట్ర కోటాలో ఒకరు...

స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌ కోటాలో సీనియర్‌ రెవెన్యూ అధికారి గేదెల శ్రీను కుమార్‌ ఐఏఎస్‌కు ఎంపిక అయ్యారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్‌ డీవోపీటీ జారీ చేసింది. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ కూడా బుధవారం ఉత్తర్వు జారీ చేశారు.

Updated Date - Jul 09 , 2026 | 04:35 AM