షాపూర్జీ పల్లోంజి పైపులకు మంటలు
ABN , Publish Date - May 22 , 2026 | 05:41 AM
గుంటూరు నగర శివారులో నిల్వ ఉంచిన భారీ పైపుల్లో మంటలు చెలరేగాయి. భూగర్భ డ్రైనేజ్ పనుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజి వీటిని తీసుకొచ్చినట్టు సమాచారం.
భూగర్భ డ్రైనేజీ పనుల కోసం గుంటూరుకు..
రూ. కోట్లలోనే నష్టం వాటిల్లినట్టు అంచనా
దుర్ఘటనా? దుర్మార్గ ఘటనా? కోణంలో విచారణ
గుంటూరు సిటీ, మే 21 (ఆంధ్రజ్యోతి): గుంటూరు నగర శివారులో నిల్వ ఉంచిన భారీ పైపుల్లో మంటలు చెలరేగాయి. భూగర్భ డ్రైనేజ్ పనుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజి వీటిని తీసుకొచ్చినట్టు సమాచారం. అగ్నికీలలతో గురువారం ఉదయం టీచర్స్ కాలనీ పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో సమీప కాలనీల ప్రజలు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. లేకపోతే మంటలు సమీప కాలనీలకు వ్యాపించి పెనుప్రమాదం సంభవించేదని అధికారులు తెలిపారు. భారీ పైపులు కావడంతో నష్టం రూ.కోట్లలో ఉండొచ్చని ప్రాథమిక అంచనా. ఏఎస్పీ(అడ్మిన్) జి.వి.రమణమూర్తి, గుంటూరు జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి తదితరులు పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం వెనుక కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. పైపులు దగ్ధమయ్యాయా లేక ఎవరైనా కావాలని నిప్పు పెట్టారనే కోణంలో విచారిస్తున్నారు.