మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Feb 09 , 2026 | 05:10 AM
ఓ మహిళా కానిస్టేబుల్ పోలీసుస్టేషన్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు.
నెల్లూరు జిల్లా సీతారామపురం పోలీస్ స్టేషన్లో ఘటన
సీఐ వేధింపులే కారణమని ఆరోపణ
ఉదయగిరి/సీతారామపురం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఓ మహిళా కానిస్టేబుల్ పోలీసుస్టేషన్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. నెల్లూరు జిల్లా సీతారామపురం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నల్లిపోగు జ్యోతి ఆదివారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. సహచర పోలీసులు వెంటనే వింజమూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొంది ఇంటికి వచ్చిన జ్యోతి విలేకరులతో మాట్లాడారు. ఉదయగిరి సీఐ వెంకటరావు వేధింపుల వల్లే ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్పారు. మూడేళ్లుగా సీతారామపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు. అక్కడ ఎస్ఐగా పని చేస్తున్న శివకృష్ణారెడ్డితో తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు సీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. తన పరువుకు భంగం కలిగేలా అసత్య ప్రచారాలు చేసిన సీఐపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.