మారిన మనసు!
ABN , Publish Date - Jun 05 , 2026 | 05:06 AM
ఆ రైతు మనసు మార్చుకున్నారు! ‘రాజధానిని వ్యతిరేకించే’ వర్గం నుంచి బయటికి వచ్చేశారు. అది కూడా... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి....
జగన్ ముందు అమరావతికి నై
24 గంటల్లోనే భూసమీకరణకు జై
రాజధానికి ఎకరన్నర ఇచ్చిన రైతు
రేపు మిగిలిన భూమీ ఇస్తామని వెల్లడి
గుంటూరు (రాజధాని), జూన్ 4(ఆంధ్రజ్యోతి): ఆ రైతు మనసు మార్చుకున్నారు! ‘రాజధానిని వ్యతిరేకించే’ వర్గం నుంచి బయటికి వచ్చేశారు. అది కూడా... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన 24 గంటల్లోనే! నేలపాడు డిప్యూటీ కలెక్టర్ను కలిసి తన భూమిని ‘భూసమీకరణ’ కింద ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. వివరాల్లోకి వెళితే... మంగళవారం జగన్ తన తాడేపల్లి ప్యాలె్సలో రాజధాని ప్రాంతానికి చెందిన కొందరు రైతులతో సమావేశమైన సంగతి తెలిసిందే. వారిలో అత్యధికులు 2014 నుంచీ అమరావతిని వ్యతిరేకిస్తూ, తమ భూములు ఇవ్వకుండా మొండికేసిన వారే. ఆ రోజు జగన్ ముందు హాజరైన రైతుల్లో నేలపాడుకు చెందిన కాప అశోక్ అనే రైతు కూడా ఉన్నారు. ‘‘నా భూమిని రాజధానికి ఇచ్చేదే లేదు. ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది. బలవంతంగా లాక్కుంటోంది’’ అని గట్టిగా విమర్శించారు. అదే కాప అశోక్ ఒక్కరోజులోనే మనసు మార్చుకున్నారు. బుధవారం నేలపాడు డిప్యూటీ కలెక్టర్కు తన భూమిలో ఎకరన్నర భూసమీకరణ కింద అప్పగించారు. మిగిలిన భూమిని కూడా శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి తుళ్లూరు డిప్యూటీ కలెక్టర్కు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.