Share News

ఆక్రమణకు గురైన ఆర్టీసీ స్థలం

ABN , Publish Date - May 28 , 2026 | 11:18 PM

స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చెందిన స్థలంలో 23 సెంట్లు ఆక్రమణకు గురైనట్టు గుర్తించామని పాడేరు ఆర్టీసీ డీఎం పి.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం చింతపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆయన సందర్శించారు.

ఆక్రమణకు గురైన ఆర్టీసీ స్థలం
ఆర్టీసీ అధికారులు, సిబ్బందితో మాట్లాడుతున్న డీఎం శ్రీనివాసరావు

23 సెంట్లు కబ్జా అయినట్టు గుర్తించాం

ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చాం

పాడేరు ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు

చింతపల్లి, మే 28 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చెందిన స్థలంలో 23 సెంట్లు ఆక్రమణకు గురైనట్టు గుర్తించామని పాడేరు ఆర్టీసీ డీఎం పి.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం చింతపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు 3.42 ఎకరాల స్థలం ఉందన్నారు. ఈ స్థలంలోని తూర్పు, దక్షిణ దిక్కుల్లో 23 సెంట్లు ఆక్రమణకు గురైందని, దీంతో అక్రమణదారులకు నోటీసులు జారీచేశామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని, లేదంటే రెవెన్యూ, పోలీసుల సహకారంతో తొలగిస్తామన్నారు. ఆర్టీసీ స్థలంలోని రెండు ఎకరాలు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టెండర్‌ ద్వారా 15 ఏళ్ల కాలపరిమితికి లీజు తీసుకున్నారన్నారు. లీజుకు కేటాయించిన స్థలంలో రెండు థియేటర్లు, కల్యాణ మండపం నిర్మిస్తున్నట్టు చెప్పారన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సాయంత్రం వేళల్లో మందుబాబులు మద్యం సేవిస్తున్నారని, దీంతో పారిశుధ్యం సమస్యతో పాటు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ విషయమై చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కాగా రాత్రి 11గంటలకు చింతపల్లి వస్తున్న భద్రాచలం ఎక్స్‌ప్రెస్‌, రాజహేంద్రవరం- అరకు ఎక్స్‌ప్రెస్‌ పాత బస్టాంట్‌ వరకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయనకు ఏఎంసీ డైరెక్టర్‌ పెదిరెడ్ల బేతాళుడు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనందరావు వినతి పత్రం అందజేశారు. ఆర్టీసీ డీఎం వెంట ఆర్టీసీ డీఈఈ సత్యనారాయణ, ఏఈఈ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ టి.రమణ ఉన్నారు.

Updated Date - May 28 , 2026 | 11:18 PM