రూ.7 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:53 AM
ఒక ఫైనాన్స్ కంపెనీ నుంచి బంగారాన్ని అపహరించిన ఆడిటర్ను అరెస్టు చేసి అతని నుంచి రూ.7 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ వెల్లడిచారు.
గతేడాది ఫైనాన్స్ కంపెనీలో ఆడిట్కు వచ్చి.. అపహరణ
4 నెలల్లో కేసు ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఏలూరు క్రైం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ఒక ఫైనాన్స్ కంపెనీ నుంచి బంగారాన్ని అపహరించిన ఆడిటర్ను అరెస్టు చేసి అతని నుంచి రూ.7 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ వెల్లడిచారు. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. చింతలపూడిలోని కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీలో ఎంతో మంది తమ కుటుంబ అవసరాలు నిమిత్తం బంగారాన్ని తాకట్టుపెట్టారు. ఆ కంపెనీలో రికార్డు ప్రకారం బంగారపు వస్తువులు అన్ని కచ్చితంగా ఉన్నాయో లేదో ఆకస్మికంగా తనిఖీలు చేయిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్ 9న విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి ఆడిట్ ఎగ్జిక్యూటివ్.. తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన వడ్లమూడి ఉమామహేశ్ చింతలపూడి వచ్చాడు. అక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ సమక్షంలో లాకరులో ఉన్న 378 బంగారం ప్యాకెట్లను ఉదయం నుంచి సాయంత్రం వరకూ పరిశీంచాడు. సాయంత్రం 5 గంటల సమయంలో ప్రవీణ్ బయటకు వెళ్లడంతో అక్కడే ఉన్న క్యాషియర్ను కొబ్బరి బొండాం తీసుకురావాలని చెప్పి బయటకు పంపించాడు. 4.490 కిలోల బరువైన 378 బంగారపు లోను ప్యాకెట్లను తన బ్యాగ్లో వేసుకున్న ఉమామహేశ్ అక్కడ నుంచి పరారయ్యాడు. అదే రోజు రాత్రి 8 గంటలకు బ్రాంచ్ మేనేజర్ చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఉమామహేశ్ కృష్ణా జిల్లా నాగాయలంకలో ఉన్నట్లు గుర్తించారు. అతన్ని బుధవారం ఉదయం అరెస్టు చేసి 4.484 కిలోల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.