తాగునీటిలో ‘ఈ-కోలి’
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:25 AM
శ్రీకాకుళం నగరంలో సేకరించిన తాగునీటి నమూనాల్లో ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.
అందుకే శ్రీకాకుళంలో డయేరియా.. 11 నమూనాల్లో బ్యాక్టీరియా గుర్తింపు
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ‘శ్రీకాకుళం నగరంలో సేకరించిన తాగునీటి నమూనాల్లో ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. డయేరియా వ్యాప్తికి ఇదే ప్రధాన కారణం’ అని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. శుక్రవారం ఆయన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి శ్రీకాకుళంలోని డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సేకరించిన నీటి నమూనాల్లో 11 చోట్ల ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. కాగా.. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన నలుగురు బాలికలు డయేరియా లక్షణాలతో కురుపాం సామాజిక ఆసుపత్రిలో చేరారు. వారిలో ఇద్దరిని శుక్రవారం ఉదయం డిశ్చార్జి చేశారు.