Minister Narayana: వైసీపీ దృష్టిలో రాజధాని ఎక్కడో చెప్పాలి
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:36 AM
రాజధానిగా అమరావతి ఒక్కటేనని కూటమి ప్రభుత్వానికి క్లారిటీ ఉందని.. మరి వైసీపీ కోరే రాజధాని ఏదో ఆ పార్టీ నేతలు స్పష్టంగా చెప్పాలని...
పారదర్శకంగా అమరావతిలో టెండర్లు: మంత్రి నారాయణ
అమరావతి, తాడేపల్లి టౌన్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రాజధానిగా అమరావతి ఒక్కటేనని కూటమి ప్రభుత్వానికి క్లారిటీ ఉందని.. మరి వైసీపీ కోరే రాజధాని ఏదో ఆ పార్టీ నేతలు స్పష్టంగా చెప్పాలని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అమరావతిపై పూటకోలా విష ప్రచారం చేయడం వైసీపీకి తగదన్నారు. ‘రివర్ బేసిన్కు, రివర్బెడ్కు తేడా లేకుండా అమరావతిపై జగన్ మాట్లాడారని, మళ్లీ సజ్జల కూడా అదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘రాష్ట్ర విభజన తర్వాత అమరావతి రాజధానికి వైసీపీ ఒప్పుకుంది. కానీ అధికారంలోకి వచ్చాక జగన్ మూడుముక్కలాట ఆడారు. మొత్తం సర్వనాశనం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు’ అని తెలిపారు. ప్రజలు ఇబ్బంది పడకూడదనే సీఎం చంద్రబాబు దూరదృష్టితో.. అన్ని కార్యాలయాలూ ఒకేచోట ఉండేలా సచివాలయాన్ని డిజైన్ చేశారని తెలిపారు. అమరావతిలో అన్ని టెండర్లు పారదర్శకంగా పూర్తి చేసి పనులు చేపడుతున్నామని, అమరావతిని ఆపడం సాధ్యం కాదని తెలిసి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు.