పోలీసు విచారణకు దువ్వాడ గైర్హాజరు
ABN , Publish Date - Jul 01 , 2026 | 05:22 AM
వైసీపీ మాజీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మంగళవారం పోలీసు విచారణకు గైర్హాజరయ్యారు. ఫోన్ స్విచాఫ్ చేసి మాయమయ్యారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై..
గన్మన్ వెనక్కి.. ఫోన్లు స్విచాఫ్... ఒడిసా వైపు పయనం!
టెక్కలి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మంగళవారం పోలీసు విచారణకు గైర్హాజరయ్యారు. ఫోన్ స్విచాఫ్ చేసి మాయమయ్యారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కొత్తూరు స్టేషన్ పరిధిలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో మంగళవారం మరోసారి విచారణకు రావాలని దువ్వాడకు నోటీసులిచ్చారు. ఈసారి కూడా ఆయన మాధురితో వచ్చి మరో డ్రామాకు తెరలేపే అవకాశాలు ఉన్నాయని భావించిన పోలీసులు.. మంగళవారం ఉదయమే ఆమెను గృహనిర్బంధంలో ఉంచారు. పోలీసులు ఇంటికి రావడంతో దువ్వాడ తన గన్మన్, డ్రైవర్తో కలిసి ఉదయం 11 గంటలకు పోలీసు స్టేషన్కంటూ బయల్దేరారు. కొంతసేపటి తర్వాత గన్మన్ను వెనక్కి పంపారు. దువ్వాడ, డ్రైవర్ ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారు. వారు ఒడిసా వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. హౌస్ అరెస్టులో ఉన్న మాధురి.. ‘నా రాజా ఫోన్ స్విచాఫ్ చేశాడు.. ఎటు వెళ్లాడు’ అంటూ మీడియా ముందు కాసేపు హడావుడి చేశారు.