దుర్గగుడి ఘాట్రోడ్డు నేటి నుంచి మూసివేత
ABN , Publish Date - May 28 , 2026 | 05:22 AM
ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఘాట్ రోడ్ మరమ్మతు పనులు ఈనెల 28వ తేదీ గురువారం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో..
15 రోజుల పాటు మహామండపం వైపు భక్తులకు అనుమతి
వృద్ధులకు, దివ్యాంగులకు, చంటి బిడ్డల తల్లులకు మాత్రమే లిఫ్ట్
సాధారణ భక్తులు మహామండపం మెట్ల మార్గం ద్వారానే వెళ్లాలి
దుర్గగుడి ఈవో శీనానాయక్ వెల్లడి
ఇంద్రకీలాద్రి, మే 27 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఘాట్ రోడ్ మరమ్మతు పనులు ఈనెల 28వ తేదీ గురువారం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్ వైపు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో వీకే శీనానాయక్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కనకదుర్గ నగర్ వైపు నుండి ప్రత్యామ్నాయ రాకపోకలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం మహామండపంలో ఈవో తన చాంబర్లో ఘాట్ రోడ్ మూసివేత, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి.హెచ్.వి.ఎస్.ఎన్. కిషోర్ కుమార్, ఈఈ రమాదేవి, ఏఈఓలు బీవీరెడ్డి, పీ.చంద్రశేఖర్, పి.సుధారాణి, ఎన్.రమేష్ బాబు, కె.గంగాధర్ తదితర అధికారులు పాల్గొన్నారు. పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఘాట్రోడ్డులో ఉన్న ప్రోటోకాల్ ఆఫీస్ను తక్షణమే కొండ దిగువన కనకదుర్గ నగర్లో కొత్తగా నిర్మించిన భవనంలోకి మార్చారు. కొత్త ప్రోటోకాల్ ఆఫీస్ వద్ద భక్తుల రవాణా కొరకు ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తగినన్ని బ్యాటరీ వాహనాలను నిరంతరం అందుబాటులో ఉంచుతారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి ఘాట్ రోడ్లో ఉన్న టికెట్ కౌంటర్ సిబ్బందిని కొత్త ప్రోటోకాల్ ఆఫీస్ వద్దకు మార్పు చేశారు. కొత్త ప్రోటోకాల్ ఆఫీస్ నుండి మహా మండపం వరకు అదనపు సెక్యూరిటీ గార్డులను, సూపర్వైజర్లకు విధులు కేటాయించారు. ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే భక్తుల దర్శనాల కోసం మహా మండపం వద్ద ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రత్యేక పాయింట్ను ఏర్పాటు చేశారు. నిత్య పూజలు, సేవల కొరకు కొండపైకి వచ్చే భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఫెస్టివల్ విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఘాట్ రోడ్ మూసివేత, ప్రత్యామ్నాయ మార్గాల గురించి భక్తులకు అవగాహన కల్పించేందుకు ఆలయ పరిసరాల్లో మైక్ ద్వారా నిరంతరం అనౌన్స్మెంట్స్ (ప్రచారం) చేయనున్నారు. మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా గల ప్రదేశంలో వాహనాల పార్కింగ్కు సీతమ్మవారి పాదాలు నుండి, కుమ్మరి పాలెం సెంటర్ నుండి, పున్నమి ఘాట్ నుండి నిరంతరం దేవస్థానం బస్సులు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.