Share News

ఊరికో రేటు..!

ABN , Publish Date - Jan 21 , 2026 | 03:49 AM

విద్యుత్తు వినియోగదారులపై చార్జీల భారాన్ని తగ్గించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థలు భారీ కసరత్తే చేస్తున్నాయి.

ఊరికో రేటు..!

  • పంపిణీ నష్టాల నివారణ పనుల్లో కక్కుర్తి

  • లైనిక్స్‌ కండక్టర్లతో నష్టాల తగ్గింపునకు ట్రాన్స్‌కో నిర్ణయం

  • 200 కి.మీ.ల మేర కండక్టర్ల మార్పిడికి టెండరు

  • కి.మీకు 2.43 లక్షలుగా ధర నిర్ణయం

  • నెల్లూరు జిల్లాలో అదే ధర ఖరారు

  • విశాఖలో మాత్రం 15 వేలు పెంపు

(అమరావతి, ఆంధ్రజ్యోతి)

విద్యుత్తు వినియోగదారులపై చార్జీల భారాన్ని తగ్గించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థలు భారీ కసరత్తే చేస్తున్నాయి. విద్యుత్తు లైన్లలో అత్యాధునిక పరికరాలను అమర్చడం ద్వారా పంపిణీ నష్టాలను తగ్గించాలని నిర్ణయించాయి. ఆయా డిస్కంల పరిధిలో ఈ పనులకు టెండర్లను పిలుస్తున్నాయి. అయితే ఈ పనులు కొందరు విద్యుత్‌ అధికారులకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఒకే రకమైన లైనిక్స్‌ కండక్టర్‌కు నెల్లూరు జిల్లాలో ఒక ధర....విశాఖపట్నం జిల్లాలో మరో ధర నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి.

ఏమిటీ లైనిక్స్‌ కండక్టర్లు?

విద్యుత్తు పంపిణీ నష్టాల నివారణలో కండక్టర్ల పాత్ర కీలకం. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు లైన్లలో అల్యూమినియం కండక్టర్‌ స్టీల్‌ రీఇన్‌పోర్సుడ్‌(ఏసీఎ్‌సఆర్‌) లైనిక్స్‌ కండక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటి స్థానంలో ఏసీఎ్‌సఎస్‌ (అల్యూమినియం కండక్టర్‌ స్టీల్‌ సపోర్టెడ్‌) లైనిక్స్‌ కండక్టర్లను వినియోగించాలని నిర్ణయించారు. ఏసీఎ్‌సఆర్‌ కండక్టర్లు అధిక ఉష్ణోగ్రతల్లో ఎక్కువ విద్యుత్తును నష్టపోతాయి. ఏసీఎ్‌సఎస్‌ కండక్టర్లు 200 డిగ్రీ సెంటిగ్రేడ్‌లోనూ విద్యుత్తును నష్టపోకుండా సరఫరా చేస్తాయి. ఏసీఎ్‌సఆర్‌ కన్నా ఏసీఎ్‌సఎస్‌ లైనిక్స్‌ కండక్టర్ల విద్యుత్తు సరఫరా సామర్థ్యం రెండున్నర రెట్లు అధికం. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఏసీఎ్‌సఎస్‌ లైనిక్స్‌ కండక్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


ధర నిర్ణయంలో ఇష్టారాజ్యం

ట్రాన్స్‌కో ఏటా వివిధ మెటీరియల్స్‌కు సంబంధించి స్టాండర్ట్‌ షెడ్యూల్‌ రేట్లను (ఎస్‌ఎ్‌సఆర్‌) నిర్ణయిస్తుంది. ఆ మేరకు ఏసీఎ్‌సఎస్‌ లైనిక్స్‌ కండక్టర్‌ ధర కిలోమీటరుకు రూ.2.43 లక్షలు. రాష్ట్రంలో ఎక్కడ టెండరు పిలిచినా ఇదే ధరను నిర్ణయించాలి. కానీ, ఈ నెల నెల్లూరు జిల్లా, విశాఖపట్నం జిల్లాలో సుమారు 200 కిలోమీటర్ల మేర లైనిక్స్‌ కండక్టర్ల మార్పిడికి పిలిచిన టెండర్లలో వేర్వేరు రేట్లు పెట్టారు. రెండు చోట్లా ఒకే కండక్టర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయినా, నెల్లూరు జిల్లాలో నిర్ణయించిన ధర కన్నా విశాఖపట్నం జిల్లాలో నిర్ణయించిన ధర రూ.15వేలు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని నెల్లూరు జిల్లాలోని రాచర్లపాడు - కావలి మధ్య 132 కేవీ లైన్‌లో 76 కిలోమీటర్ల మేర కండక్టర్‌ను ఏర్పాటు చేసేందుకు టెండరు పిలిచారు. ఎస్‌ఎ్‌సఆర్‌లో నిర్ణయించిన మేరకే ఇక్కడ ధర నిర్ణయించారు. అయితే ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలోని విశాఖపట్నం జిల్లాలో మాత్రం ధర పెంచేశారు. ఇక్కడ బ్రాండిక్స్‌ ఫ్యాక్టరీ నుంచి నర్సింగబిల్లి వరకు 77 కిలోమీటర్లు, పెందుర్తి నుంచి ఆనందపురం వరకు 118.5 కిలోమీటర్లు మేర కండక్టర్‌ ఏర్పాటుకు టెండరు పిలిచారు. కిలోమీటరుకు ఇక్కడ రూ.2,58,095 లుగా ధరను నిర్ణయించడంపై ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 200 కిలోమీటర్ల మేర రూ.15వేలు చొప్పున దోపిడీకి అధికారులు తెర దీశారన్న విమర్శలున్నాయి. మున్ముందు ఇంకా కొన్ని వందల కిలోమీటర్ల మేర లైనిక్స్‌ కండక్టర్లను మా ర్చాల్సి ఉన్న నేపథ్యంలో, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఆదిలోనే ఈ దోపిడీకి చెక్‌ పెట్టాల్సి ఉంది.

Updated Date - Jan 21 , 2026 | 04:43 AM