Share News

ధర్మవరంలో రూ.38కోట్లతో హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌

ABN , Publish Date - Mar 18 , 2026 | 07:00 AM

ధర్మవరం చేనేత కార్మికుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు.

ధర్మవరంలో రూ.38కోట్లతో హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌

  • రూ.100 కోట్ల స్థాయికి విస్తరించేందుకు కృషి

  • చేనేతల అవగాహన సదస్సులో మంత్రి సత్యకుమార్‌

  • 8 నెలల్లో క్లస్టర్‌ ఏర్పాటు, 8వేల మందికి ఉపాధి: మంత్రి సవిత

ధర్మవరం, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ధర్మవరం చేనేత కార్మికుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏర్పాటు కానున్న మెగా హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌పై చేనేత కార్మికులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, బీసీ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత, కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. సత్యకుమార్‌ మాట్లాడుతూ, 2024 సార్వత్రిక ఎన్నికల హామీ మేరకు రూ.38కోట్లతో హ్యాండ్లూమ్‌ మెగా క్లస్టర్‌ను ధర్మవరానికి తీసుకువచ్చామని తెలిపారు. ఈ ప్రాజెక్టును మాస్టర్‌ వీవర్స్‌ భాగస్వామ్యంతో రూ.100 కోట్ల స్థాయికి విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మంత్రి సవిత మాట్లాడుతూ ధర్మవరం మెగా హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌ను రూ.38 కోట్లకుపైగా నిధులతో ఎనిమిది నెలల్లో పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. ఈ క్లస్టర్‌ ఏర్పాటుతో ఎనిమిది వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు సాధనలో మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ధర్మవరంలో చేనేత ఉత్పత్తుల ప్రోత్సాహం కోసం ఆప్కో షో రూం ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత ప్రకటించారు. నేతన్నల ఆరోగ్య రక్షణకు యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీలో ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. త్వరలో నేతన్న భరోసా పథకం కింద చేనేతలకు రూ.25 వేలు ఆర్థికసాయం అందిస్తామని ఆమె వెల్లడించారు.

Updated Date - Mar 18 , 2026 | 07:00 AM