పౌరాణిక పాత్రల్లో గుమ్మడి మెప్పించారు
ABN , Publish Date - Jun 14 , 2026 | 05:30 AM
ప్రతిష్ఠాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల కళాకారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆయనకు కేంద్ర అవార్డు రావడం సంతోషం
అవార్డులకు ఎంపికైన తెలుగు కళాకారులకు అభినందనలు: డిప్యూటీ సీఎం పవన్
అమరావతి, జూన్ 13(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల కళాకారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. 2024, 2025 సంవత్సరాలకు ప్రకటించిన పురస్కారాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 18 మంది కళాకారులు ఎంపిక కావడం మనందరికి గర్వకారణమన్నారు. ఈమేరకు పార్టీ కార్యాలయం శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ నాటక రంగానికి చేసిన సేవలను గుర్తించి పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషకరమన్నారు. పౌరాణిక నాటకాల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హారిశ్చంద్రుడు లాంటి పాత్రలను గుమ్మడి పోషించి ప్రేక్షకులను మెప్పించారని గుర్తుచేశారు. ప్రసిద్ధ కూచిపూడి నృత్యకారులు పసుమర్తి రత్తయ్యశర్మ లాంటి కళాకారులు కేంద్ర నాటక అకాడమీ అందించే ఫెలోషి్పకు ఎంపిక కావడం మరింత ఆనందాన్నిచ్చిందన్నారు. 2024 ఏడాదికి కొమండూరి శేషాద్రి, రాజేశ్వరి సాయినాథ్, సూర్యనారాయణ కుమార్, ఓలేటి రంగమణికు అవార్డులు దక్కాయన్నారు. 2025 సంవత్సరానికి పంతుల రమ, డి.శ్రీనివాస్, నాగజ్యోతి, సింధె చిదంబరరావు, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్కు, యువ పురస్కారాలకు ఎంపికైన లహరి కొలచెల, పేరి త్యాగరాజు, అజయ్ శ్రీనివాస్ చక్రవర్తి, షేక్ మహబూబ్ సుభాని, బి.సుచిత్ర, వేదాంతం సిద్దేంద్ర వరప్రసాద్, పావని పసుమర్తిలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
రామయ్యకు అభినందనలు
పురాతన జానపద వాయిద్యం కడ్డీతంత్రిపై స్వరాలు వినిపిస్తున్న కళాకారుడు, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన దురిశెట్టి రామయ్య జాతీయ సంగీత నాటక అవార్డుకు ఎంపిక కావడం సంతోషకరమన్నారు. రామయ్య కళా సేవలు అమూల్యమైనవని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అరుదైన వాయిద్య, జానపద కళాకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి సముచితంగా గౌరవిస్తోందన్నారు.
అరకులో బ్లడ్ బ్యాంక్ నిర్మాణంపై హర్షం
అరకు ప్రభుత్వాసుపత్రిలో దాదాపు రూ.1.15 కోట్లతో బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మించేందుకు బెంగళూరుకు చెందిన బీఎ్సఆర్ చారిటబుల్ ట్రస్ట్ శంకుస్థాపన చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు శనివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. అరకు పర్యటన సమయంలో గిరిజన మహిళలు అనీమియాతో పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఆయన బ్లడ్ బ్యాంక్ నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీఎ్సఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిధులు సమకూర్చి బ్లడ్ బ్యాంకు నిర్మాణానికి పూనుకుంది.